YS Jagan: ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయంగా ఉండగానే ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. రెండేళ్ల ముందుగానే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, జనసేన బలంగా ప్రజల్లోకి వెళుతుండగా.. సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు చెక్ పెడుతున్నారు. వారి స్ధానాల్లో ప్రత్యామ్నాయ నేతలను తెరపైకి తెస్తున్నారు.
దాదాపు 30 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల ద్వారా తేలింది. దీంతో వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి జగన్ వచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండలో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా.. ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ ను నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పినట్లు అయింది. త్వరలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలపై జగన్ ఇలాంటి నిర్ణయాలే తీసుకోనున్నారు.
వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో వేరే వారిని సమన్వయకర్తలుగా నియమించనున్నారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ కు పోటీగా ఆళ్ల రామక్రిష్టారెడ్డికి కాకుండా వేరేవారిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. ఆళ్ల రామక్రిష్టారెడ్డిని ప్రస్తుతం అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గానికి పంపనున్నారు.
ఇక అంబటి రాంబాబును అవనిగడ్డకు పంపాలని జగన్ నిర్ణయించారు. ఇక మంత్రి ఉషశ్రీ చరణ్ ని హిందూపురం నుంచి పోటీలోకి దింపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇక ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.
ఇక పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూతురిని కల్యాణ దుర్గం నుంచి బరిలోకి దిగాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటినుంచే అభ్యర్థులను ఒక్కొక్కరిగా జగన్ కన్ఫామ్ చేస్తున్నారు.