YS Sharmila: వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా ఢిల్లీలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. తన భర్త, సువార్తీకుడు అనిల్కుమార్తో కలిసి ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో ఆమెతో సుమారు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల సోనియా గాంధీతో కలిసి కుటుంబ విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా జగన్ గురించి సోనియా అడిగారని, ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
ఇక, తెలంగాణ రాజకీయాల గురించిన ప్రస్తావనలో వైఎస్సార్ టీపీని విలీనం చేయడంపై ప్రధానంగా చర్చించారట. ఈ సందర్భంగా గతంలో తాను నిర్దేశించుకున్న డిమాండ్లనే షర్మిల తాజాగా సోనియా ముందు కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. పాలేరు టికెట్తో పాటు తన వారికి 15 మందికి టికెట్లు ఇవ్వాలని షర్మిల పట్టుబట్టారట. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పోస్టు కోసం షర్మిల గట్టి పట్టే పడుతున్నట్టు ఢిల్లీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ విషయంలో సోనియా నర్మగర్భంగా వ్యవహరించినట్టు సమాచారం. పదవుల విషయాన్ని ఎన్నికల తర్వాత చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
ప్రధానంగా పార్టీ విలీనం, షర్మిల సేవలను ఏ రకంగా ఎక్కువగా వాడుకుంటారన్నదానిపైనే చర్చించినట్టు తెలిసింది. వైఎస్ చరిష్మా గురించి సోనియా అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఏదేమైనా షర్మిల పట్టుదల పట్ల సోనియా గాంధీ కొంత మేరకు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.