Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సినిమాల ప్రభావం మనుషులపై తీవ్రంగా చూపుతోంది. సినిమాల్లో అంశాలను కొందరు మంచిగా తీసుకుంటే.. మరికొందరు అందులోని విలనిజం ఆదర్శంగా తీసుకుని జైలు పాలవుతున్నారు. ఇటీవల సూపర్హిట్ అయిన పుష్ప సినిమాలో చూపించిన విధంగా స్మగ్లింగ్ చేద్దామని కొంతమంది దొంగలు ప్రయత్నించి పోలీసుల చిక్కి జైలు పాలయ్యారు. ఇలా ఒకొక్కరు ఒక్కో సినిమాను ఆదర్శంగా తీసుకుని వివిధ దురాఘాతాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేజీఎఫ్ సినిమాను ఆదర్శంగా తీసుకున్నాడు ఓ యువకుడ. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సూపర్డూపర్ అయింది. మధ్యప్రదేశ్ కి చెందిన 19 ఏళ్ల శివ ప్రసాద్ కేజీఎఫ్ సినిమాలో రాకీభాయ్ లా ఫేమస్ అవ్వాలని హత్యలు చేయడం ప్రారంభించాడు. నలుగురు సెక్యూరిటీ గార్డులను అతి కిరాతకంగా తలపై కొట్టి చంపి సీరియల్ కిల్లర్ గా స్థానికులకు భయం పుట్టించాడు.
ఇతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేసి రాత్రి సమయంలో గస్తీని పెంచారు. సీసీ కెమెరాల్లో క్రిమినల్ ని గుర్తించిన పోలీసులు.. ఆ సీసీటీవీ విజువల్స్ ని బాగా ప్రచారం చేశారు. హత్య చేసిన వారిలో ఒకరి సెల్ ఫోన్ ను దొంగిలించడంతో ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. దొంగిలించబడ్డ ఫోన్ని ట్రాక్ చేయడంతో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సీరియల్ కిల్లర్ ని అరెస్ట్ చేశారు. మే నెలలో మధ్యప్రదేశ్ లో ఒక బ్రిడ్జ్ కింద సెక్యూరిటీగా ఉన్న వ్యక్తిని దారుణంగా చంపాడు. సెక్యూరిటీ గార్డులే లక్ష్యంగా వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. ఆగస్టు 28న ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కళ్యాణ్ అనే వ్యక్తిని, ఆ తర్వాతి రోజు సాగర్ ఏరియాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో గార్డుగా పనిచేస్తున్న శంభు నారాయణ్ దూబే అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు.
ఆ తర్వాత ఓ ఇంట్లో వాచ్మెన్ పని చేస్తున్న మంగళ అహిర్వార్ అనే వ్యక్తిని చంపేసి భోపాల్ పారిపోయాడు. అక్కడ గురువారం రాత్రి కూడా సోనూ వర్మ అనే వ్యక్తిని మార్బుల్ రాడ్ తో కొట్టి చంపాడు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డును చంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎట్టకేలకు ఫోన్ ట్రాక్ చేసి శివప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా కేజీఎఫ్ లో రాకీ భాయ్ లా ఫేమస్ అవ్వడం కోసమే ఈ హత్యలు చేస్తున్నట్లు శివప్రసాద్ పోలీసులకు చెప్పాడు.