BCCI: టీ20 వరల్డ్ కప్ సెమీస్లో టీమిండియా ఘోర పరాజయం చెందడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తంపై వేటు వేసింది. దీంతో కొత్త సెలక్షన్ కమిటీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన చీఫ్ సెలక్టర్గా ఎవరు ఎంపిక అవుతారన్న విషయం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి దరఖాస్తు చేసినట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం అజిత్ అగార్కర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా సేవలు అందిస్తున్నాడు. ఒకవేళ సెలక్షన్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలంటే కోచ్ పదవిని వదిలేయాల్సి ఉంటుంది. అయితే గత ఏడాది దుబాయ్లో జరిగిన టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే అభయ్ కురువిల్లా పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి సెలక్షన్ కమిటీలో వెస్ట్జోన్ స్థానం ఖాళీగానే ఉంది. దీంతో వెస్ట్ జోన్ నుంచి అజిత్ అగార్కర్ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
గతంలో ముంబై చీఫ్ సెలక్టర్గా పనిచేసిన అనుభవం అజిత్ అగార్కర్కు ఉంది. దీంతో అతడు చీఫ్ సెలక్టర్గా ఎంపికయ్యే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే బీసీసీఐ ఇంకా అగార్కర్తో సంప్రదింపులు జరపలేదని తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో అపార అనుభవం ఉన్న అగార్కర్ సూచనలు, అనుభవం టీమిండియాకు వెలకట్టలేనివి అని.. అతడు కుర్రాళ్లను బాగా అర్ధం చేసుకుని ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ అధికారి తెలిపాడు.
సెలక్టర్ కావాలంటే ఎంత అనుభవం ఉండాలి?
సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావాలంటూ బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. కనీసం 7 టెస్టు మ్యాచ్లు లేదా కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన వారు అర్హులు అని పేర్కొంది. అజిత్ అగార్కర్ తన కెరీర్లో 26 టెస్టులు, 191 వన్డేలు, 4 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. బౌలింగ్లో టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లు, టీ20ల్లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు