Virat-MSD: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఏం చేసినా సంచలనమే. గ్రౌండ్ లో దూకుడుగా కనిపించే కోహ్లీ సోషల్ మీడియాలో కూడా అంతే చురుగ్గా ఉంటాడు. తన సహచర ఆటగాళ్లను టీజ్ చేస్తూ పెట్టే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా కోహ్లీ తన మాజీ సహచర ఆటగాడు, సోదరుడిగా భావించే మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఓ పోస్టు పెట్టాడు. ‘అతడు ఎక్కడైనా ఉంటాడు సర్వాంతర్యామి..’ అని పోస్టులో రాసుకొచ్చాడు.
ఇంతకీ ఏమైందంటే.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక టూర్ లో ఉన్నాడు. ఉత్తరాఖండ్ లోని పలు ఆలయాల సందర్శనకు వెళ్లాడు. ఈ క్రమంలో కోహ్లీ ఓ వాటర్ బాటిల్ ఫోటోను షేర్ చేశాడు. సదరు వాటర్ బాటిల్ బ్రాండ్ కు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇదే విషయాన్ని కోహ్లీ తన పోస్టులో నొక్కి చెప్పాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కోహ్లీ ధోని ఫోటో ఉన్న వాటర్ బాటిల్ ను షేర్ చేస్తూ.. ‘అతడు (ధోని) ఎక్కడైనా ఉంటాడు. వాటర్ బాటిల్ మీద కూడా..’ అంటూ స్మైలీ ఎమోజీ షేర్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ధోని – కోహ్లీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోహ్లీ 2008లో భారత జట్టులోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకూ ఈ ఇద్దరి మధ్య ఆటగాళ్ల కంటే ఎక్కువగా సోదరభావం ఉంది. తన కష్టకాలంలో ధోని ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని.. అతడు ఇచ్చిన ధైర్యంతోనే తాను తిరిగి ఫామ్ లోకి రాగలిగానని కోహ్లీ ఇటీవలే ఆర్సీబీ పోడ్కాస్ట్ లో కూడా తెలిపిన విషయం తెలిసిందే.