Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొంతకాలంగా పేలవ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ సహా న్యూజిలాండ్ పర్యటనలో పంత్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సంజు శాంసన్ రాణిస్తుండగా అతడికి అవకాశాలు ఇవ్వకుండా పదే పదే విఫలమవుతున్న పంత్కు వైస్ కెప్టెన్సీ హోదాలో ఎలా జట్టులో స్థానం కల్పిస్తారని టీమిండియా అభిమానులు బీసీసీఐ వైఖరిపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ పర్యటనకు పంత్ను ఎంపిక చేసిన సెలక్టర్లు సంజు శాంసన్ను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పంత్కు గాయమైందని అతడిని వన్డే సిరీస్ మొత్తానికి పక్కనపెట్టారు. తొలి వన్డేలో పంత్ బదులు కేఎల్ రాహుల్కు వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించి అదనంగా ఆల్రౌండర్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే బీసీసీఐ వైఖరి చూస్తుంటే పంత్ను కావాలనే తప్పించారని.. గాయం పేరుతో సాకు చెప్తూ అతడి స్థానంలో వేరొకరిని ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. అప్పటికల్లా తుదిజట్టు కూర్పుపై కసరత్తు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జట్టులో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్గా ఎవరిని తీసుకోవాలి అన్న అంశంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రోహిత్ కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. మెగాటోర్నీకి 11 నెలల సమయం ఉండటంతో ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని రోహిత్ అంటున్నా జట్టు కూర్పులో మార్పులు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
పంత్కు నిజంగానే గాయమైందా?
బంగ్లాదేశ్ టూర్లో వన్డే సిరీస్కు పంత్ దూరం కావడంపై బీసీసీఐ చెప్తున్న మాట గాయం. అదే నిజమని అనుకుందాం. అయితే ఈ గాయం ఎప్పుడు అయిందనేది ప్రధాన ప్రశ్న. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడితే తొలి వన్డే వరకు ఆ విషయాన్ని బీసీసీఐ దాచిపెట్టడంతో ఆంతర్యమేంటని పలువురు నిలదీస్తున్నారు. ఒకవేళ ఫామ్లో లేని పంత్ను తప్పించాలని బీసీసీఐ భావిస్తే అతడి స్థానంలో సంజు శాంసన్కు ఎందుకు అవకాశాలు ఇవ్వరని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్ రూపంలో కీపర్ ఉన్నాడని.. అందుకే మరో కీపర్ అవసరం లేదని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు.