KCR: బీఆర్ఎస్ అధినేత అయినా కేసీఆర్ వచ్చే లోక్ సభ ఎన్నికలలో మహారాష్ట్ర నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ మహారాష్ట్రపై బాగా ఫోకస్ పెట్టడం, ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించడం, వాటిలో కేసీఆర్ పాల్గొనడం చూస్తుంటే మహారాష్ట్ర రాష్ట్రంపై బీఆర్ఎస్ ఇంట్రెస్ట్ ఫోకస్ అర్థమవుతోంది. అయితే తాజాగా కేసీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇందుకోసం రెండు లోక్ సభ సీట్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నాందేడ్, ఔరంగాబాద్లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేయొచ్చని సమాచారం. నాందేడ్ నుంచి బీబీ పాటిల్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని గతంలో వినిపించినప్పటికీ ఇప్పుడు తాజాగా కేసీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. బీబీ పాటిల్ నాందేడ్లో మకాం వేసి బీఆర్ఎస్కు అనుకూలంగా నియోజకవర్గాన్ని మార్చగలిగితే కేసీఆరే రంగంలోకి దిగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాందేడ్, ఔరంగాబాద్ ప్రాంత నేతలను బీఆర్ఎస్లో చేర్చుకుంటుండడంతో పాటుగా అక్కడి ప్రాంతాల కోసం, నేతల కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది.
నాందేడ్, ఔరంగాబాద్ రెండు నియోజకవర్గాలు తెలంగాణకు పొరుగునే ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలను వందల సంఖ్యలో బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే పనిలో బీఆర్ఎస్ వర్గాలున్నాయి. ముందుముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పోటీ చేసేందుకు నాందేడ్తో పాటు ఔరంగాబాద్ స్థానం సైతం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయి. లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మహారాష్ట్రలో ఎంత బలపడుతుంది. నాందేడ్, ఔరంగాబాద్లు కేసీఆర్ పోటీకి పూర్తిగా అనుకూలంగా మారుతాయా అనే దాన్ని బట్టి ఆయన పోటీ ఉంటుంది మరి.