Chandrababu Naidu: ప్రస్తుతం ఏపీలో వేడివేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే అప్పుడే అందుకు సంబంధించిన వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను సందర్శిస్తూ యువగలం పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేలపై, వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారాయి. తెలంగాణ ఏపీని పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ అయినా అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే నమ్మకం ఆశతో ఆ భూములు విలువ పెరుగుతుందని కానీ ఏపీలో ఎవ్వరికి ఆ ఆశలు లేవని ఆయన అన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు కొనే వారని కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. దీనికి కారణం ఎవరో ప్రశ్నించుకోవాలని కూడా ఏపీ జనాలకు చంద్రబాబు నాయుడు సూచించారు.