YCP: ఏపీలో వైసీపీకి పతనం మొదలైందా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు అనేక రకాల సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే ఏపీ అధికార పార్టీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఎన్నికలలో ఎలా అయినా విజయం సాధించాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం సీఎం జగన్ అభ్యర్థుల స్థానాల్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరి స్థానాన్ని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరాకరించడంతో ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆళ్ల రామ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆయన వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆమెతో పాటు తాను కూడా చేరతానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారికంగా వేరే పార్టీలో చేరిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. షర్మిల ఆర్కేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం ముందు నుంచి ఉందని, ఆ పార్టీకి సంస్థాగతంగా బలమైన కార్యవర్గం ఉందని ఎమ్మెల్యే ఆళ్ల గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వ లోపాలను కూడా తాను ఎండగడతానని ఎమ్మెల్యే ఆళ్ల హాట్ కామెంట్స్ చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆర్కేకు వైఎస్ జగన్ సీటు నిరాకరించారు. ఈ సీటును చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే వైసీపీ పతనం ఆర్కే తోనే మొదలవుతుంది అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.