Tirupattur: తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొడుకు తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అసలేం జరిగిందంటే.. తమిళనాడు రాష్ట్ర తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని పచూర్ ప్రాంతంలో కాపురం ఉంటున్న మోహన్ అనే 55 ఏళ్ళ వ్యక్తి అతని భార్య వరమతి అనే 50 ఏళ్ళ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లల సంతానం కాగా వారు గిరి 32 ఏళ్లు,ముత్తు అనే 28 ఏళ్ళ కుమారులు అలాగే సంధ్య అనే 20 ఏళ్ల అమ్మాయి ఉన్నారు. వృత్తి రిత్యా రైతు అయిన మోహన్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు.
వీరి రెండో కుమారుడు ముత్తు గత కొంతకాలంగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ యువతి ముత్తు ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన ముత్తు మూడు నెలలుగా ఇంటిలో నుంచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ముత్తు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై తండ్రి మోహన్ మెడపై కాలుతో నొక్కి హత్య చేశాడు. అది చూసి షాక్ అయిన తల్లి వరమతి, చెల్లెలు సంధ్య ముత్తుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని కూడా కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో ఇద్దరూ ఇంటిలో స్పృహతప్పి పడిపోయారు. వారి కేకలు విన్న ఇరుగు పొరుగు ముత్తును బంధించి తాళ్లతో కట్టేశారు.
అనంతరం నాట్రంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన వరమతి, సంధ్యలను ఇరుగు పొరుగు వారు చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ముత్తును అరెస్టు చేశారు.