Alla: తాజాగా సోమవారం రోజు తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు నలుగురు ఎమ్మెల్యేలతో సహా మరికొందరు మొహం చాటేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. వైసీపీ తో గ్యాప్ వచ్చిందన్న ప్రచారాలను ఆర్కే ఖండించారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా జగన్తో విభేదాలు వచ్చే మాటే లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే తేల్చి చెప్పేసారు.
దీంతో వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉంటున్నారన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సమావేశానికి రాకపోవడం పై వివరణ ఇచ్చారు.. అనారోగ్య సమస్యతో పాటు తన కుమారుడు పెళ్లయి 16 రోజుల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ వెళ్లినట్టు తెలిపారు. మంగళగిరిలో తాను పోటీ చేయాలా లేదా అనేది జగన్ నిర్ణయం బట్టే ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కుప్పంలో చంద్రబాబు పోటీ చేయలేక పక్క నియోజకవర్గాలు చూసుకుంటున్నారని ఆరోపించారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు న్యాయం జరుగుతోందని, సామాజిక న్యాయం చేయాల్సిన తరుణంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. జగన్ తోనే ఉంటానని అసెంబ్లీ వేదికగా గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జీవితంలో, రాజకీయాల్లో ఉన్నంత కాలంలో జగన్ తో లేదా వ్యవసాయం చేసుకుంటానని అంటూ స్పష్టతనిచ్చారు. పక్క పార్టీల వైపు చూసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఒక వేళ మంగళగిరిలో తాను పోటీ చేయకపోయినా వైసీపీనే గెలుస్తుందని ఆయన తేల్చి చెప్పేసారు.
తన కుమారుడి పెళ్లికి సీఎం జగన్ను పిలవకపోవడాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. అది పూర్తిగా తమ వ్యక్తిగతం అన్నారు. వాట్సప్ స్టేటస్లో ఫొటోలు మార్చడాన్ని కూడా మీడియా ప్రశ్నిస్తోందని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం న్యాయమా? అని ఆర్కే ప్రశ్నించారు.. ప్రస్తుతం ఆర్కే మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.