CM Jagan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త నియామకాలకు తెరదీశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నిబంధనల మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. అయితే త్వరలోనే ముగిసిపోనున్న అసెంబ్లీకి ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపట్టడం ఏంటనేది ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. కాగా మరో 8 మాసాల్లో ఏపీ అసెంబ్లీ గడువు తీరనున్న విషయం తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ భేటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం జరిగే సభ. అవి కూడా మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే జరగే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు కావడంతో ప్రతిపక్షాల దూకుడు పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సహజంగానే సభా కాలాన్ని కుదించుకుంటాయి. మరి అటువంటి అసెంబ్లీలో ఇప్పుడు సభా హక్కుల కమిటీ పేరుతో ఎమ్మెల్యేలకు పోస్టులు ఇచ్చారు. ఈ కమిటీకి చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడం జరిగింది. ఇతర సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి,సుధాకర్ బాబు, అబ్బయ్య చౌదరి, చిన అప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్ లకు అవకాశం ఇచ్చారు.
మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. వీరికి అసెంబ్లీలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ఇచ్చిన జీవోలో పేర్కొ న్నారు. అదేసమయంలో మరో తొమ్మిది అనుబంధం కమిటీలను కూడా నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే అసెంబ్లీ ముగిసిపోతున్న సమయంలో ఈ పదవులు ఇచ్చి ఏం చేయాలని అనుకుంటున్నట్టు అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్న. ఆయా సామాజిక వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ఈ ప్రయత్నం చేశారా? అనే చర్చ సాగుతోంది.