India vs Pakistan: ప్రపంచంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే విశేషంగా ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే క్రికెట్ ప్రేమికులు పాకిస్తాన్,భారత్ మ్యాచ్ ఉంది అంటే చాలు ఆఫీసులు వారి పనులు అన్ని ఎగ్గొట్టి మరి టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతుంటారు. అయితే అటువంటి మహాసంగ్రామం ఆగస్టు 28న జరగబోతోంది. కాగా ఆగస్టు 28వ తేదీన జరగబోయే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం ఎప్పటిలాగే క్రికెట్ ప్రేమికులు ఎగబడ్డారు.
క్షణాల వ్యవధిలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా ఆసియా కప్ 2022లో భాగంగా భారత్,పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28 న జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. అయితే ఈ టికెట్ల అమ్మకం మొదలుపెట్టిన క్షణాల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల అమ్మకాన్ని ప్లాటినం లిస్ట్ అనే ఒక వెబ్ సైట్ నిర్వాహకులు అప్పగించారు. ఇక టికెట్ల అమ్మకం ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే లక్షల టికెట్లు అమ్ముడైయ్యాయి.
అయితే ఇక రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సైట్ లోకి ఒకే సారి 7.5 లక్షల మంది లాగిన్ అవ్వడంతో కాసేపు అంతరాయం ఏర్పడింది. దీనితో ఆన్లైన్ లో ట్రాఫిక్ ఆపడానికి నిర్వాహకులు ఆన్లైన్లోనే క్యూ పద్ధతిని పాటించారు. చాలామందికి ఈ టికెట్ల విషయంలో నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కొందరు అభిమానులు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై విమర్శలను సైతం గుప్పించారు. కౌన్సిల్ సరైన నిబంధనలు పాటించలేదని, టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని క్రికెట్ అభిమానులు ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ దాయదుల పోరు అంటే తగ్గేదే లే అంటూ టికెట్ల అమ్మకాలు జరిగాయి.