Baby: మనదేశంలో ఆధార్ కార్డు తప్పనిసరైంది. ఎలాంటి దరఖాస్తులైనా.. ప్రభుత్వ పథకాలైనా ఆధార్ అనుసంధానం ఉండాల్సిందే. తాజాగా నవజాత శిశువుల జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ను నమోదు చేసే సదుపాయం అన్ని రాష్ట్రాల్లో రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నవజాత శిశువులకు సైతం ఆధార్కార్డు రానుంది. నేటి కాలంలో ఆధార్కు ఉన్న ఆదరణ నేపథ్యంలో నవజాత శిశువులకు ఆధార్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో నవజాత శిశువుల ఆధార్ నమోదు సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ప్రక్రియ ఏడాది క్రితమే ప్రారంభమై.. క్రమంగా అనేక రాష్ట్రాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటోంది.
అప్పుడే పుట్టిన బిడ్డకు వారి తల్లిదండ్రుల ఆధారంగానే ఆధార్ కేటాయిస్తారు. పిల్లలు పెద్దయ్యాక వేలిముద్రలు తీసుకుని కార్డును అప్డేట్ చేస్తారు. ఈ ప్రక్రియ కోసం నిరంతరం కసరత్తులు జరుగుతున్నాయని అన్ని సౌకర్యాలు ఉన్నా రాష్ట్రల్లో వీటిని అమలు చేస్తున్నారు. ఇప్పటికే సాగుతున్న రాష్ట్రల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని ఆయా రాష్ట్రల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ఒక్కసారి ఆధార్ వచ్చిందంటే జీవితాంతం అదే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లోనూ ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు బిడ్డ పుట్టినప్పుడు జనన ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి, ఆ తర్వాత ఆధార్ కార్డు రూపొందించే వారు. ఇలా చేయడంతో పని ఎక్కువగా అయ్యేది. దీంతో పాటు గంటల కొద్ది కార్యాలయాలకు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నవజాత శిశువులకు ఆధార్ ఇస్తే సమయం ఆదాతో పాటు, మున్ముందు ఆధార్ కోసం ఇబ్బందులు తలెత్తావు. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అభిప్రాయపడింది.