BCCI:ఆ రూల్ అందరికీ వర్తించదు.. బీసీసీఐ కొత్త నిబంధనతో కంగుతిన్న ఫ్రాంచైజీలు
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఈ లీగ్ లో ప్రవేశపెట్టబోతున్న కొత్త రూల్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’. 2023 సీజన్ నుంచి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నట్టు బీసీసీఐ ఇటీవలే తెలిపింది. ఆటకు మరింత క్రేజ్ తీసుకురావడం దీని వెనుక ప్రధాన ఉద్దేశంగా ఉన్నదని చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ రూల్ ప్రకారం ప్రతీ జట్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు నలుగురు ప్లేయర్లను సబ్స్టిట్యూట్స్గా ప్రకటించాలి. 14 ఓవర్ల ఆట తర్వాత ఈ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా తుది జట్టులోకి తీసుకోవచ్చు.
వాస్తవానికి క్రికెట్ కు ఇది కొత్తది కానీ ఫుట్బాల్, రగ్బీ, కబడ్డీ వంటి ఆటల్లో ఇది పాతదే. దీని ప్రకారం 14 ఓవర్ల తర్వాత ఒక ఆటగాడు అనుకున్న స్థాయిలో ఆడకుంటే అతడి స్థానంలో అప్పటికే ప్రకటించి ఉన్న నలుగురిలో ఒక ఆటగాడిని అప్పటికప్పుడు జట్టులోకి తీసుకోవచ్చు.
అయితే ఈ నిబంధనను తీసుకురావడం పట్ల ఫ్రాంచైజీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ రూల్ ద్వారా మ్యాచ్ విన్నర్లను సృష్టించొచ్చని, మ్యాచ్ ను మలుపుతిప్పవచ్చని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ వారికి షాకిచ్చింది. వచ్చే సీజన్ నుంచి జరుగబోయే ఐపీఎల్ లో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కేవలం ఇండియన్ క్రికెటర్స్ కే వర్తిస్తుందని, ఫారెన్ ప్లేయర్లకు ఆ అవకాశం లేదని ఫ్రాంచైజీలకు తెలిపినట్టు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది.
ఇంపాక్ట్ ప్లేయర్ ఫార్ములాను ఫారిన్ ప్లేయర్లకు అనుమతిస్తే అప్పుడు ఐపీఎల్ ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా వెళ్లినట్టు అవుతుందని బీసీసీఐ భావిస్తున్నది. ప్రస్తుతం ఫ్రాంచైజీలు ఒక మ్యాచ్ లో నలుగురు ఫారెన్ ప్లేయర్లను మాత్రమే ఆడించడానికి అవకాశముంది. ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవాల్సి వస్తే.. ఒకవేళ అవకాశం ఉంది కదా అని ఫ్రాంచైజీలు మరో ఫారెన్ ప్లేయర్ నే ఆడిస్తే అప్పుడు జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు అవుతారు. ఈ కారణంగానే బీసీసీఐ.. ఇండియన్ ప్లేయర్స్ కు మాత్రమే వర్తించేలా నిబంధన తీసుకొచ్చింది. అయితే ఒకవేళ ఫారెన్ ప్లేయర్లకు కూడా ఈ నిబంధనను వర్తింపచేయాలంటే ఫ్రాంచైజీలు తుది జట్టులో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ను తీసుకుని, ఇంపాక్ట్ ప్లేయర్ గా నాలుగో ఆటగాడిగా తీసుకోవచ్చా..? అని ఎదురవుతున్న ప్రశ్నలకు బీసీసీఐ సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ విషయమై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.