BCCI: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వల్ల నెరవేరని ఐసీసీ ట్రోఫీ కలను రోహిత్ శర్మ అయినా నెరవేరుస్తాడని అతడిని తీసుకొచ్చింది బీసీసీఐ. రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినా ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. అంతకంటే మునుపు ఆసియా కప్ లో కూడా భారత జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది.
ఒక చైర్మెన్, నలుగురు సభ్యులు ఉండే సీనియర్ సెలక్షన్ కమిటీపై వేటు వేసిన తర్వాత బీసీసీఐ ఈ స్థానాలను భర్తీ చేయడానికి దరఖాస్తులను స్వీకరించింది. నామినేషన్ల పర్వం ముగిసిన ఈ ప్రక్రియలో సుమారను 200 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చీఫ్ సెలక్టర్ రేసులో పలు పేర్లు వినిపిస్తున్నాయి. నయాన్ మోంగియా, మనీందర్ సింగ్, నిఖిల్ చోప్రాలు రేసులో ముందున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం చీఫ్ సెలక్టర్ రేసులో టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీసీసీఐ ఇటీవలే నియమించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) కూడా వెంకటేశ్ అభ్యర్థిత్వానికి మద్ధతు తెలుపుతున్నట్టుగా ఇన్సైడ్స్పోర్ట్స్ కథనం ద్వారా తెలుస్తున్నది.
ఒకవేళ వెంకటేశ్ ప్రసాద్ అభ్యర్థిత్వం గనక ఖరారైతే బీసీసీఐ, టీమిండియా లో టాప్ పోస్ట్ లో కర్నాటకకు చెందినవారే ఉన్నట్టు అవుతుంది. ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ స్వరాష్ట్రం కర్నాటక. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా కన్నడిగుడే. వెంకటేశ్ ప్రసాద్ (ఒకవేళ చీఫ్ సెలక్టర్ గా ఎంపికైతే) కూడా కర్నాటకకు చెందినవాడే కావడం గమనార్హం. ఒకరకంగా భారత క్రికెట్లో ఈ పోస్టులన్నీ అత్యున్నత స్థాయికి చెందినవే.