Jagan-Chandrababu: తాజాగా రాజధాని పరిధిలోని మందడం గ్రామంలో నిర్వహించిన తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం అనే కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్కల్యాణ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఏపీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారు అంటూ బాబు విమర్శించారు. ఇవాళ పండుగేమో భోగి.. పాలకుడేమో మానసిక రోగి అని ఆయన వ్యాఖ్యానించారు.
శుభగడియలు తలుపు తడుతున్నాయని.. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. మన రాజధాని అమరావతే.. ఇది ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుంది. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు ఉపయోగపడుతుంది. జగన్కు కూల్చడమే తెలుసు నిర్మించడం తెలియదు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు పోరాడారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలి. రాజకీయ హింస, మోసపు హామీలతో జగన్ బడుగు బలహీనవర్గాల ఉసురు తీస్తున్నారు.
32 రోజులుగా అంగన్వాడీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు. పండగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేశారు. వైకాపా పాలనలో రైతులు చాలా కష్టాలు పడ్డారు. గిట్టుబాటు ధర లేదు. తుపాను వచ్చి నష్టపోయినా వారిని పట్టించుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను తెదేపా, జనసేన తీసుకుంటాయి అని చంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు.