Chinnamma: తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు జగన్ పరువు తీసేసింది. అయితే ఈమె మొదటి నుంచి జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ పై మండిపడుతూ ఒక రేంజ్ లో విరుచుకుపడింది చిన్నమ్మ. కార్యాలయకు వైసీపీ రంగుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఉచిత హామీల నుంచి డబ్బుల దాకా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ఇప్పుడు జరుగుతున్న అప్పుల వరకు కూడా అన్నింటని గురించి మాట్లాడుతూ దుమ్ముదులిపేసింది చిన్నమ్మ.
తాజాగా ఆదివారం విజయవాడలో మాజీ సీఎం నల్లారికిరణ్కుమార్రెడ్డి, మాజీ చీఫ్ సోము వీర్రాజు సహా పలువురు నేతలతో కలిసి పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన పురందేశ్వరి.. వైసీపీ సర్కారు నాలుగేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. తనను రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలిగా నియమించినా అందరి సహకారం కావాలని కోరారు. ఎన్నికలకు ఐదారు నెలలే సమయం ఉందని అందరూ జనంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ఎవరూ గుండెల మీద చేయి వేసుకుని పడుకునే పరిస్థితి లేదని అన్నారు. అన్ని వర్గాల వారు ఆవేదన, ఆందోళనతో ఉన్నారని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని, ఈ హామీలు అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగా ఈ హామీలు అమలు చేశారా అనేది అంశాల వారీగా ప్రజలకు మనం వివరించాలని సూచించారు.
పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు పంచుతున్నారని నిప్పులు చెరిగారు. మద్యం, మైనింగ్ మాఫియాతో కోట్లు దోచుకున్నారని సీఎం జగన్పై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం నివాసానికి సమీపంలో దళిత మహిళ పై అత్యాచారం జరిగితే నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. అలాగే ఒక బాలుడిని సజీవ దహనం చేస్తే పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పై ఆందోళన ఉందని తెలిపారు. వలంటీర్లు పర్మినెంట్ కాదని, వారిని సీఎం జగన్ మోసంచేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పోయి ఉపాధి కోల్పోయారని అన్నారు. ఒక పరిశ్రమ ఇక్కడ ఇబ్బందులు చూసి కోయంబత్తూరులో పెట్టుబడి పెట్టిందని పురందేశ్వరి తెలిపారు. సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవడానికి ఇసుక మాఫియానే ప్రధాన కారణమని పురందేశ్వరి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ప్రభుత్వం మళ్లించిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు కడితే వాటికి రంగులు వేయడం పైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు.