CM Jagan: ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు త్వరగా మారుతుండటంతో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వాస్తవం అర్థమవుతోంది. దీంతో.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జగన్ తో ఉంటే జనంతో ఉండలేమని అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే నెమ్మదిగా ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. మంగళవారం నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీని వీడటంతో అదే బాటలో మరికొంత మంది వెళ్లే అవకాశం ఉంది. ఆయన పార్టీని విడుతూ తరచూ అందరూ చేసేలా వ్యక్తిగత విమర్శలు, బురదచల్లే మాటలు చెప్పలేదు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో క్యార్డర్ కన్ఫ్యూజ్ అవుతున్నారని.. అందుకే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ మాటలు వాస్తవాలకు దగ్గరగా ఉండటంతో వాటి ప్రభావం ప్రజలపైనా, కార్యకర్తలపైనే కాకుండా పార్టీలో చాలామంది నేతలపైనా పడ్డాయి.
నిజానికి జగన్ ఒంటెత్తు పోకడలు, అవమాన భారం భరించలేకే లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీని వీడారు. నరసరావుపేటలో ఆయన గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐపాక్ సర్వేల్లో కూడా ఇదే విషయం తేలింది. నరసరావుపేట లోక్సభ పరిధిలోని అందరూ ఎమ్మెల్యేలు ఆయననే ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని అధిష్టానం దగ్గర చెప్పారు. శ్రీకృష్ణదేవరాయులు వివాదరహితుడుగా మంచి పేరుంది. దీంతో ఆయన గెలుపు ఈజీ అవుతుంది. కానీ, అమరావతి రైతులు చేస్తున్న నిరసనల్లో ఓసారి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దగ్గర రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని మాటిచ్చారు. ఇదే విషయం జగన్ కి నచ్చలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలపై స్పందించాలి. అమరావతి రైతుల విషయంలో కూడా ఆయన అలాగే స్పందించారు. అలా పాజిటివ్ గా స్పందించారు కనుకే.. మరోసారి ఆయన గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, జగన్ ఇవేవి పట్టించుకోకుండా అమరావతి రైతులకు మద్దతిచ్చారు కనుక తనను టికెట్ ఇవ్వనని మొండిగా కూర్చున్నట్టు చర్చ నడుస్తోంది. అయితే, ఆ మొండిపట్టే ఇవాళ వైసీపీ కంచుకోటలను బద్దలు కొడుతోందని రాజకీయ విశ్లేణలు వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయులే కాదు.. చాలా మంది ఇలాంటి అవమాన భారంతో వైసీపీలో ఉన్నారని తెలుస్తోంది.
వారంతా ఇప్పుడు పార్టీని వీడటానికి సిద్దమవుతున్నారు.
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తనకు జరిగిన అవమానంపై అవమానంపై బహిరంగంగానే మాట్లాడారు. దీంతో పెనమలూరులో పార్థసారథి స్థానంలో మంత్రి జోగి రమేష్ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అప్పటి నుంచి పార్థసారథి సైలంట్గా ఉన్నారు. ఆయనతో ఇప్పటికే టీడీపీ నేతలు ఒకటి రెండు సార్లు భేటీ అయ్యారు. మంచి రోజు చూసుకొని ఆయన సైకిల్ ఎక్కేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు కాసుమహేష్ కోసం గురజాల నియోజకవర్గాన్ని వదిలేసానని.. కానీ, ఇప్పుడు తనకే టికెట్ కేటాయించాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కోరుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని పార్టీ ఆదేశాలతో వదిలేశానని.. ప్రతీసారి ఇలాగే చేస్తే తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, జగన్ ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో, ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక లావు శ్రీకృష్ణ దేవరాయులకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ కూడా పార్టీకి షాక్ ఇవ్వడానికి కారణం వెతుకుతున్నారని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ఇప్పటికే కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు డాక్టర్ సంజీవ్కుమార్, వల్లభనేని బాలశౌరి పార్టీ గుడ్ బైూ చెప్పి.. ఎంపీ పదవులకీ రాజీనామా చేసేశారు. ఇక ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి కూడా పార్టీనీ వీడారు. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారు. కాపు మాత్రం తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించేశారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారో అనేది ఇంకా క్లారిటీ లేదు. జగన్ కు గుడ్ బై చెబుతున్న నేతలు అందరూ పక్కాగా గెలిచే సత్తా ఉన్నావారే కావడంతో.. వైసీపీ కంచుకోటలు బద్దలు అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది.