KCR-Jagan: తెలంగాణ బడ్జెట్ సమావేశాల పుణ్యమా అని కాంగ్రెస్కు ఒకే దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టే అవకాశం దక్కింది. రాక రాక వచ్చిన ఛాన్స్ను రేవంత్ రెడ్డి లాంటి మాటకారులు ఎందుకు వదులుకుంటారు? అందుకే ఓవైపు జగన్ను, మరో వైపు కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారు. తెలంగాణకు నీళ్లు తీసుకొచ్చిన భగీరధుడుగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ గురించి గొప్పలు చెబుతారు. అయితే, అదే వాటర్ ఇప్పుడు ఆయన్ని డీ గ్లామర్ చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కేసీఆర్ తెలంగాణ నీటికి ఏపీకి ధారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో నిరూపించారు. అసెంబ్లీతో ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఎల్ఈడీలో చూపించారు. కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని ఏపీని నీళ్లు విడుదల చేశారని జగన్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తెలంగాణ అసెంబ్లీలో ఉత్తమ్ వినిపించారు. దీంతో.. జగన్, కేసీఆర్ చీకటి ఒప్పందం బయటపడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వాటర్ విషయంలో పలు ఆరోపణలు చేస్తున్నారు. రోజా పెట్టిన రొయ్యిల పులుసు తిని తెలంగాణ వాటర్ ఏపీకి ఇచ్చేవారని మండిపడుతున్నారు. అప్పుడే కేసీఆర్ రాయలసీమను రతనాల సీమను చేస్తానని శపధం కూడా చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. రేవంత్ ఆరోపణలకు తగ్గట్టుగానే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వినిపించిన జగన్ మాటలు ఉన్నాయి. దీంతో.. బీఆర్ఎస్ నేతల దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది. అంతేకాదు.. నాగార్జున సాగర్ ను ఏపీలో పోలీసులు చుట్టూ ముట్టి నీళ్లును దోపీడి చేస్తే అప్పటి సీఎం కేసీఆర్ చూస్తూ ఉండటం తప్పా.. చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇక, ఏపీ విషయానికి వచ్చినట్టు అయితే ఈ అంశాలపై జగన్ కూడా మాట్లాడ లేకపోతున్నారు. తెలంగాణ నీళ్లు దోచుకోవాల్సిన అవసరం తమకు లేదని బలంగా చెప్పలేకపోతున్నారు. మా వాటా మేమేం తీసుకున్నామని జగన్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఏపీ ప్రజలు అసంతృప్తికి గురి అవుతున్నారు. ఏపీ పోలీసులను తెలంగాణ సీఎం దొంగలు అని ప్రస్తావించినా జగన్ మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే కేసీఆర్, జగన్ మధ్య ఏదైనా చీకటి ఒప్పందం కుదిరిందా? అని చర్చ నడుస్తోంది.
జగన్ వ్యవహారంపై టీడీపీ నేతలు కూడా మొదటి నుంచి పలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే జగన్.. హైద్రాబాద్ లో ఉన్న ఏపీ ఆస్తులను తెలంగాణకు వదిలేశారని ఆరోపిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులను తెలంగాణకు ఒక్క సంతకంతో ధారాదత్తం చేశారని టీడీపీ విమర్శిస్తోంది. అందుకే.. జగన్ మౌనం వహిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందిస్తే.. ఈ అంశం హైద్రాబాద్ లోని ఏపీ ఆస్తుల వరకూ వెళ్తుందని.. దాని వలన మరింత డ్యామేజ్ జరుగుతోందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. జగన్ మౌనంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడుతున్నారు.