Mahalakshmi Temple: భారతదేశంలో అన్ని రాష్ట్రల్లో వివిధ రకాల దేవాలయాలు ఉన్నాయి. చాలా మంది మనస్సు ప్రశాంతత కోసం గుళ్లు, ఆలయాలకు వెళ్తుంటారు. సాధారణంగా గుడికి వెళ్లగా పూజల అనంతరం అందరికీ అక్కడి పూజారి ప్రసాదం ఇవ్వడం మామూలే. అయిన ఇక్కడ మాత్రం గుడికి వెళ్తే మాత్రం ప్రసాదానికి బదులుగా ఆభరణాలు ఇస్తారు. మన దేశంలో కొన్ని చోట్ల అద్భుతమైన ఆలయాలు నెలకొన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు సైన్స్కు కూడా అంతు చిక్కడం లేదు. అయితే ఇక్కడి ఆలయానికి వచ్చే వారు ప్రసాదంతో ఇంటికెళ్లాల్సిన భక్తులు బంగారు, వెండి నాణేలతో వెళ్తారు.
మధ్యప్రదేశ్లోని రత్లామ్లోని ప్రత్యేకమైన మహాలక్ష్మి ఆలయం ఏడాదంతా నిరంతరం భక్తులతో కిటకిలాడుతోంది. భక్తులు మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంత కోట్లాది రూపాయల నగలు, నగదు సమర్పించుకుంటారు. దీపావళికి ముందు భక్తులు ఆభరణాలు, నగదు సమర్పించే దేశంలోని ఏకైక ఆలయం ఇదే. కొందరు నోట్ల కట్టలు, మరికొందరు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తారు. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి గాంచింది. దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో దంతేరస్ నుంచి 5 రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో ధన్ తేరాస్ రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తిరిగి వెళ్లేటప్పుడు బంగారం, వెండి, డబ్బులు ఇలా ఏదో ఒక రూపంలో ప్రసాదం రూపంలో తీసుకెళ్తారు. ధన్తేరస్ నుండి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా అది రెట్టింపు అవుతుందని భక్తుల అపార నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలదీ బంగారం, వెండితో అమ్మవారి చెంతకు చేరుకుని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా తమ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వారం తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం, వెండి, డబ్బులను ఆలయ నిర్వాహకులు మళ్లీ అందజేస్తారు. మొదట అమ్మవారికి సమర్పిస్తున్న సమయంలోనే వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది.