AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ కేడర్కు సంకేతాలు ఇచ్చారు. కాగా తమ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు కోరుకోవడం లేదని, మోదీ సర్కార్ అంటువంటి ఆలోచనలో ఉందని, అందుకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది అని అధికార పార్టీ నేతలు ఆప్ ది రికార్డుగా చెబుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఐదారు నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది.
మరోవైపు ఆంధ్రాలో వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మోదీ సర్కార్ మూడు నెలల ముందు ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంతేకాకుండా అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ కావాలని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి ఏపీ వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా లతో ఆయన భేటీ కానున్నారు. ముందస్తు ఎన్నికలపై ఈ పర్యటనలో సీఎం జగన్కు క్లారిటీ ఇవ్వవచ్చు అనే చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ముందస్తుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు స్పష్టత వస్తే, ఎన్నికలపై వైఎస్ జగన్ వ్యూహం వేగం అందుకోనుంది.
అలాగే ఏపీలో ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ పలుమార్లు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా తమ వాళ్లను కాపాడుకునేందుకు ముందస్తుపై వారు మాట్లాడినా, జగన్కు ఇప్పటికీ ముందస్తుకు వెళ్లాలనే ఆలోచన లేకపోవడం గమనార్హం. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెగెటివిటీ పెరగకుండా కొంచెం ముందే ఎన్నికలకు వెళితే మంచిదనే అభిప్రాయంలో బీజేపీ వుంది. మొత్తానికి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు కన్ఫామ్ అయ్యేలా ఉంది.