YS Jagan: ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో మళ్లీ తానే సీఎం అవ్వాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ వేదికగా శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర, విష్వక్సేన పూజలు, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధనతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ప్రారంభించారు.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఈ మహాయజ్ఞం చేపట్టినట్టు దేవదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులో తెలిపింది. కానీ, అంతర్లీనంగా సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే సంకల్పంతోనే ఈ యాగం చేస్తున్నారు అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న ఈ యాగం కోసం సుమారు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. అయితే ఈ ఖర్చులను దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాలపై వేయడం విమర్శలకు తావిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఆర్జేసీ, ఉపకమిషనర్ కేడర్ దేవాలయాలు 5 వేల కరపత్రాలు, 2 వేల వాల్పోస్టర్లు, పది పెద్ద హోర్డింగ్లు, 50 ఫ్లెక్సీలు, 50 బ్యానర్లు ముద్రించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక సహాయ కమిషనర్, గ్రేడ్ 1, 2, 3 దేవాలయాలు 2 వేల కరపత్రాలు, 1000 వాల్పోస్టర్లు, ఐదు పెద్ద హోర్డింగ్లు, 20 ఫ్లెక్సీలు, 25 బ్యానర్లను ముద్రించాలని పేర్కొన్నారు. అసలు జగన్ మరోసారి సీఎం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న యాగానికి దేవాలయాల నిధుల నుంచి ప్రచార సామగ్రిని ముద్రించడం ఏమిటని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ యాగానికి మొత్తం రూ.10 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్టు దేవదాయ శాఖ తెలిపింది. అలాగే వివిధ దేవాలయాల నుంచి నిధులు మళ్లిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో దేవదాయ శాఖ పరిధిలోని ఒక్కో ఆలయంపై రూ.30 లక్షల భారం పడుతుందని ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి మళ్లీ జగన్ సీఎం అవుతారో లేదో తెలియదు కానీఅంతో ఇంతో నడుస్తున్న ఆలయాలు మాత్రం ఈ దెబ్బతో అప్పుల కుప్పలుగా మారడం ఖాయమని అంటున్నారు టీడీపీ నాయకులు.