Hanuman: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. తాజాగా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ప్రస్తుతం కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలను వెనక్కు నెడుతూ హనుమాన్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
కాగా ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ బత్తి చూస్తుంటే ఈ మూవీ ప్రశాంత్ వర్మ, హీరో తేజా కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోనున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలోకీ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సందర్బంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే షార్ట్ఫిలింస్, డాక్యుమెంటరీలు చేశాను. నేను అందుకున్న సర్టిఫికెట్లను ఒక సూట్కేసులో పెట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్సులలు ఇస్తారేమో అని తిరిగేవాడిని. అది చూసిన చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని పంపించేశారు. కొన్నిరోజులకు పరిస్థితి అర్థమై అవేమీ లేకుండా తిరిగాను.
ఒక సారి ఒకరి రికమండేషన్తో ఒక డైరెక్టర్ను కలిశాను. ఆయన ముందు కూర్చున్న రెండు నిమిషాలకే రేయ్, నీళ్లు తీసుకురారా అన్నాడు. ఆఫీస్ బాయ్ను పిలుస్తున్నాడేమోనని దిక్కులు చూస్తుంటే నిన్నేరా అన్నాడు. వెంటనే నేను కిచెన్లో నుంచి నెమ్మదిగా ఆఫీస్ బయటకు వచ్చేశాను. ఇది జరిగి దాదాపు తొమ్మిది ఏళ్ళు అవుతోంది. ఇటీవల ఆ దర్శకుడు సాయం కోసం మా ఆఫీస్కు వచ్చాడు. ఆయనకు నేనెవరో గుర్తులేదు. నేను కూడా గతాన్ని తవ్వకుండా తనకు కావాల్సిన సహాయం చేసి పంపించేశాను. ఒకసారైతే పెద్ద డైరెక్టర్, నిర్మాత మాట్లాడుకుంటున్నారు. నేను వారికి కొంత దూరంలో నిలబడ్డాను. నన్ను చూసి.. నీకిక్కడ ఏం పనిరా.. వెళ్లిపో అని బూతులు తిట్టారు అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించారు ప్రశాంత్ వర్మ.