YS Jagan: ప్రభుత్వం గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరగడానికి వారికి ప్రభుత్వం చేస్తున్న మేళ్లు గురించి వివరించడానికి వాలంటీర్లు ముందు ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జగన్ మాటలు వింటే ఆయన వైసీపీ క్యాడర్ కన్నా ఎక్కువగా వాలంటీర్లపై నమ్మకం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాలంటీర్లు ఈ ప్రభుత్వానికి పట్టుకొమ్మలని కొనియాడారు. ఏ ప్రభుత్వంలోనూ వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని, 25 పథకాలకు సంబంధిచిన బ్రాండ్ అంబాసిడర్లు వాలంటీర్లేనని సీఎం జగన్ అంటున్నారు. 5 కోట్ల ప్రజల ప్రతి గడపవద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగే సత్యసారధులు వాలంటీర్లు అని ప్రతి గడపకూ నేరుగా వాలంటీర్లే మనకున్న బలం అని నేరుగా చెప్పారు.
ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి అనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులని.. వాలంటీర్ కార్యక్రమం మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని జగన్ హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు.
సీఎం జగన్ వాలంటీర్లే తమ ప్రభుత్వం గురించి ప్రజలకు చెబుతారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు . పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పెద్దగా పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు సీఎం జగన్ పై ఉన్నాయి. ఇప్పుడు అదే పద్దతిలో ఆయన వాలంటీర్లే తనకు దిక్కన్నట్లుగా ప్రసంగించడం పార్టీ నేతలను ఆశ్చర్య పరుస్తోందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.