Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసం కూతురు వైయస్ షర్మిల తెలంగాణలో వైసీపీని స్థాపించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో షర్మిల టచ్ లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు తీవ్రంగా కృషి చేసిన డీకే శివకుమార్ తో షర్మిల భేటీ కావడంతో కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లకు ఊతమిచ్చేలాగా వైయస్సార్ ఆత్మ, మాజీ ఎంపీ కెవిపి రామచంద్రరావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఆ విషయంపై తనకు సమాచారం ఉందని కెవిపి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, కాంగ్రెస్ లో చేరేందుకు షర్మిల కొన్ని షరతులు పెట్టారని, ఈ రోజో రేపో ఆ చర్చలు కొలిక్కి వస్తే వెంటనే షర్మిల పార్టీలో చేరుతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే షర్మిలతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చర్చలు జరిపారని, రాహుల్ గాంధీ దగ్గరకు జానారెడ్డితో షర్మిల రాయబారం పంపారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పీసీసీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు.
ఆ ప్రచారంలో నిజం లేదని, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు నిజం కాదని అన్నారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తానని, ఇటువంటి మధ్యవర్తిత్వం చేయనని జానారెడ్డి తెగేసి చెప్పారు. ఓవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని కేవీపీ చెబుతుంటే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన విషయం నిజం కాదని జానారెడ్డి చెప్పటం గందరగోళానికి దారి తీస్తోంది. అంతకుముందు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని షర్మిల తేల్చేశారు. ఏపీ కాంగ్రెస్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా ఇదే విషయాన్ని షర్మిల తేల్చి చెప్పారట. కానీ, ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ లో చోటు లేదని రేవంత్ రెడ్డి వర్గం చెబుతోంది. షర్మిల చేరిక విషయం ఏపీ కాంగ్రెస్ చూసుకుంటుందని, తెలంగాణకు సంబంధం లేదని రేవంత్ స్వయంగా క్లారిటీనిచ్చారు.