IPL vs T20: టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యానికి అందరూ ఐపీఎల్ కారణమని తప్పుబడుతున్నారు. ఐపీఎల్ డబ్బుల వర్షం కురిపిస్తుందని.. భారత ఆటగాళ్లు ఐపీఎల్కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని.. అంతర్జాతీయ మ్యాచ్లను పట్టించుకోరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లను క్రమం తప్పకుండా ఆడే భారత ఆటగాళ్లు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడటం లేదని మాజీ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఐపీఎల్ను రద్దు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
నిజంగా చెప్పాలంటే ఐపీఎల్ వల్ల భారత్ రిజర్వ్ బెంచ్ బలం పెరిగింది. కానీ ఆ బలాన్ని ఉపయోగించుకోవడంలో టీమ్ తడబాటుకు గురవుతోంది. ఎవరిని జట్టులో ఉంచాలి.. ఎవరిని తీసివేయాలి అన్న సందిగ్ధత టీమిండియా మేనేజ్మెంట్లో కనిపిస్తోంది. దినేష్ కార్తీక్, అశ్విన్ విషయంలో ఇక్కడే టీమిండియా పప్పులో కాలేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు మాజీలు ప్రస్తావిస్తున్నారు.
ఐపీఎల్ వల్ల భారత జట్టుకు లాభం చేకూరుతుందని అందరూ భావిస్తున్నారని.. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఒక్క టీ20 ప్రపంచకప్ కూడా గెలవలేదని పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీమ్ అక్రమ్ ఆరోపించాడు. అటు భారత బౌలర్లు ఐపీఎల్ ఆడితే వారి వేగం పడిపోతోందని అక్రమ్ అన్నాడు. అవేష్ ఖాన్ 140-145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసేవాడు అని.. ఐపీఎల్ ముగిసిన తర్వాత అతడి బౌలింగ్ వేగం 130-135 కిలోమీటర్లకు పడిపోయిందని గుర్తుచేశాడు.
మరి మిగతా జట్ట పరిస్థితి ఎలా ఉంది?
ఐపీఎల్తో భారత జట్టు లాభమా? నష్టమా అన్న సంగతి పక్కన పెడితే మిగతా జట్లు మాత్రం విశేషంగా లాభపడుతున్నాయి. భారత్లోని అన్ని స్టేడియాలలో ఉండే పరిస్థితులను విదేశీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తమ జట్టు భారత్లో పర్యటించినప్పుడు దీనిని సొమ్ము చేసుకుంటున్నారు. అటు ప్రపంచకప్లో రాణించిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాడు. తనకు ఐపీఎల్ వల్ల లాభమే చేకూరిందని వెల్లడించాడు. తన ఆటతీరును ఐపీఎల్ మెరుగుపరిచిందని, ఐపీఎల్ ఆడిన సమయాన్ని బాగా ఎంజాయ్ చేశానని అన్నాడు. శామ్ కరణ్ తరహాలో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.