YCP: ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా అప్పుడే ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. కానీ ఏపీలో మాత్రం రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది,?ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే విషయం ప్రస్తుతం మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా రంగంలోకి దిగి ఆ పార్టీకి ఇన్ని, ఈ పార్టికి ఇన్ని ఓట్లు వస్తాయి అంటూ లెక్కలు చెబుతున్నారు.
అయితే ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిపడుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ కనీ వినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని సర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల వ్యతిరేక సర్వేరాయుళ్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవడం ఖాయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ కేవలం 42-43 శాతం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్ ఆశలు ఏమేరకు సానుకూలంగా మారతాయి? అనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయకులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్లలో పార్టీ ఓటమి చెందే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ విశషం పై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.