Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు అప్పుడే కనిపిస్తోంది. ఎన్నికల ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీల నాయకులు ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టిడిపి పార్టీని బలోపేతం చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించాడు. మరొకవైపు చంద్రబాబు కూడా ప్రజలలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా జగన్, చంద్రబాబు ఇద్దరూ కూడా ఉత్తరాంధ్ర పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 3న విశాఖ విజయనగరం జిల్లాల దశ దిశ మార్చేసే అనేక కీలకమైన పధకాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల మూడవ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఈ విమానాశ్రయం నిర్మాణం ద్వారా పాతిక వేల మందికి ఉపాధిని కల్పించే అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ పార్క్ తో పాటు విజయనగరంలోని తారకరమా సాగునీటి ప్రాజెక్ట్ లకు సంబంధించిన కార్యక్రమాల కోసం జగన్ ఉత్తరాంధ్రా టూర్ కి వస్తున్నారు.విశాఖ విజయనగరం జంట నగరాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ మీద టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ తో పాటు విజయనగరం విశాఖలో వైసిపి ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే మొదలయ్యాయని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో జగన్ పర్యటన ముగిసిన వెంటనే చంద్రబాబు కూడా ఉత్తరాంధ్ర టూర్ కి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో టిడిపిని బలోపేతం చేయటానికి చంద్రబాబు నెలలోనే రెండుసార్లు ఉత్తరాంధ్ర టూర్ కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 10, 11 తేదీలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారని, అలాగే ఈ నెల 17న ఆయన విశాఖ జిల్లా టూర్ కి మరోసారి రానున్నారని సమాచారం.