YCP: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థుల కొరత ఉందా.. దీటైన అభ్యర్థుల ఎంపికకు జగనన్న కష్టపడుతున్నారా.. అందుకే నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబానికి టికెట్లు కేటాయించడానికి సిద్ధపడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ అధికారంలోకి రాకుండా చేసేందుకు ప్రతిపక్షాలు కృషి చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే జగన్ కూడా అప్రమత్తమయ్యారు. సర్వేల మీద సర్వేలు నిర్వహించి ప్రస్తుతం ఎమ్మెల్యేల స్థానంలో చాలా చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
సరియైన అభ్యర్థుల కోసం జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గట్టి అభ్యర్థి అయినట్లయితే నిబంధనలను సవరించి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి కూడా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే పై ప్రజల్లో వ్యతిరేకత అవినీతి ఆరోపణలు ఇతర కారణాలతో చాలామందిని జగన్ మార్చే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 58 అసెంబ్లీ స్థానాలకు పది పార్లమెంటు స్థానాలకు వైసీపీ ఇన్చార్జిలను మార్చేశారు. ఈ పార్టీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో రెండేసి టికెట్లు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది.
ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి నిరాశక్యత చూపించడంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కి అవకాశం ఇచ్చారు. టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నానికి అక్కడే టికెట్ ఇచ్చారు. ఇంతకాలం వైసీపీ లో కొనసాగుతున్న పొట్లూరి వరప్రసాద్ రావుని పక్కనపెట్టి అధికారికంగా పార్టీ కండువా కూడా కప్పుకోని నానికి అవకాశం ఇవ్వటం గమనార్హం. అలాగే చీపురుపల్లి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ,ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక ఆయన సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గాను కొనసాగుతున్నారు. విశాఖపట్నం ఎంపీగా బొత్స సత్యనారాయణ భార్య భర్త ఝాన్సీ లక్ష్మికి అవకాశం కల్పించారు. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పార్టీ కార్యకర్తలు.