RRR: సినిమా పాటలకు ఉన్న ప్రత్యేకత వేరే పాటలకు ఉండదని చెప్పొచ్చు. సినిమా పాటలో స్వరం, గాత్రం, భావంతో పాటు నాట్యం, అభినయం, వినోదం వంటివి కలగలిపి ఉంటాయి. సినిమా పాటలో కథ చెబుతూనే, ప్రేక్షకుల్ని అలరించే గుణం ఉండాలి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట కూడా ఆ కోవకు చెందినదే. ఈ పాట అందుకే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ తోడయ్యాక ఆ పాటని రాజమౌళి తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక `గోల్డెన్ గ్లోబ్ అవార్డు`ను ఆ పాట అందుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమను మరో మెట్టుకు తీసుకెళ్లింది.
దీంతో ఆర్ఆర్ఆర్ కూడా `ఆస్కార్`కు మరింత చేరువైందనే చెప్పాలి. తన సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా చూపించాలని చూస్తాడు. ఎన్టీఆర్, రామ్చరణ్ ఇద్దరితోనూ రాజమౌళి ఏం అద్భుతాలు సృష్టిస్తాడో అని ప్రేక్షక లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన తరుణంలో ఇద్దర్నీ ఓ రేంజ్ లో జక్కన్న చూపించారు.
ఈ పాటని 19 నెలలు చంద్రబోస్ రాశారు. `నాటు నాటు` అనే హుక్ లైన్ అందాక మిగిలిన పాటను కాస్త పరుగెత్తించాడు. కీరవాణితో ఫస్ట్ మీటింగ్ అయ్యాక రెండు రోజుల్లోనే మూడు పల్లవులను రాసి వినిపించారు. అందులో కేవలం ఒకదాన్ని మాత్రమే కీరవాణి ఎంపిక చేశారు. మిగిలిన పాట మొత్తం రాయడానికి 19 నెలలు పట్టిందని చంద్రబోస్ చెప్పుకొచ్చాడు. మధ్యమధ్యలో ఎన్నో కరెక్షన్లు జరిగాయి.
ఒకొక్క పదం పుట్టడానికి ఒక్కో రోజు పట్టేదని, చివరికి పాట మొత్తం పూర్తయ్యాక ఉక్రేయిన్లో చిత్రీకరించినప్పుడు చివరి లైన్లు మార్చాల్సి కూడా వచ్చిందని సమాచారం. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న చంద్రబోస్కి ఫోన్ చేస్తే ఆయన `పుష్ప` పాటల్లో బిజీగా ఉన్నా కూడా కేవలం 15 నిమిషాల్లో చివరి లైన్లు మార్పించి రాశారు. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొని నాటునాటు పాట ఇంతటి ఘనత సాధించింది.