Sharmila: రోజురోజుకీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఆలోచనలు అంత చిక్కడం లేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం త్రిముక పోరు ఖాయంగా కనిపిస్తోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారు.ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రేపు అనగా ఆదివారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి నాలుగు గంటలకు ఇడుపుల పాయకు చేరుకోనున్నారు. అలాగే అక్కడ తన తండ్రి వైఎస్ రాజశేర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు షర్మిల. ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సహా కాంగ్రెస్ నేతలు ఇడుపులపాయ వెళతారు. ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విజయవాడలో ఒక ఫంక్షన్హాల్లో నిర్వహించే కార్యక్రమంలో ఉదయం 11 గంటలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీలో చేరికల ద్వారా ఎంట్రీతోనే ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన షర్మిల పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా.. రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీతో పాటుగా టీడీపీ నేతలు కొందరితో కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు చేస్తున్నారని సమాచారం