Jagan Plan: ఆంధ్రప్రదేశ్ లో అభ్యర్థులు ఎంపికలో వైసిపి దూకుడు ప్రదర్శిస్తుంది. త్వరలోనే ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఈ లోపు అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో కీలక సెగ్మెంట్ అయిన విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీకి కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటివరకు విశాఖపట్నం ఎంపీ సెగ్మెంట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ పోటీ చేసిన వారందరూ కూడా మిగతా ప్రాంతాల నుంచి వచ్చినవారే. దగ్గుబాటి పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు,ఎంవీవీ సత్యనారాయణ ఇలా ప్రతి ఒక్కరు బయట ప్రాంతాల నుండి వచ్చి ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఈ ఎంపీ సీటును ఉత్తరాంధ్ర స్థానికురాలికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని బీసీ ఓటర్లు అందరినీ ఆకర్షించ వచ్చు అనేది జగన్ మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. గతంలో 2014 ఎన్నికల్లో ఇదే ఎంపీ స్థానం నుండి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ నిలబడి ఘోర పరాజయాన్ని పొందారు.
ఈ నేపథ్యంలో కీలకమైన నేతకు ఎంపీ సీటు ఇస్తే సులభంగా గెలవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.బొత్స ఝాన్సీకి స్థానికంగా మంచిపేరు ఉంది. ఆమె సైకాలజీలో డాక్టరేట్ చేశారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయ విద్యలో రెండు పీహెచ్డీలు కంప్లీట్ చేశారు. ఇటీవల హైకోర్టు న్యాయవాదిగా ఏపీ బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా అందుకున్నారు. రాజకీయాల్లోనూ ఆమె కీలకంగా రాణిస్తున్నారు.
గతంలో జడ్పీచైర్పర్సన్గా ఆమె పనిచేశారు. రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఎన్నికవ్వగా విజయనగరం పార్లమెంటు ఏర్పడిన తర్వాత తొలి ఎంపీగా ఆమె నిలిచారు. అప్పుడు టిడిపి నేత అశోక్గజపతిరాజుపై ఆమె విజయం సాధించారు. అయితే బొత్స కుటుంబానికి ఉన్న బలాన్ని వాడుకుని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం ఓట్లు రాబట్టాలని ప్రయత్నంలో ఉన్నట్లు ఈ ప్రణాళిక చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రజలు దీన్ని ఆమోదిస్తారో లేక తిప్పి కొడతారో వేచి చూడాలి.