Jupally: తెలంగాణ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు కురిపించారు. 2019లో జరిగిన ఎన్నికలలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కేసీఆర్ పూర్తిగా సహకరించారని ఈయన వెల్లడించారు. కెసిఆర్ చంద్రబాబు నాయుడుకు రాజకీయపరంగా ఏమాత్రం సరిపడదు దీంతో రెండోసారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈయన జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారని జూపల్లి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సహకరించడమే కాకుండా రాయలసీమ ఎత్తిపోతలకూ మద్దతు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది జలాలపై జరిగిన చర్చలో జూపల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా గత కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పూర్తిగా తప్పుపట్టారు.
గతంలో తెలంగాణలో నదీ జలాల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉన్న విషయంపై కూడా జూపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని నిలదీశారు. జల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రానికి బీఆర్ ఎస్ ఎందుకు మద్దతు తెలిపిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు విషయాన్ని చూపించి ఏపీలో విలీనం చేసినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఈయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఇక తాగునీటి ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఈ ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరగలేదని హరీష్ రావు నిరూపిస్తారా అని ఈయన ప్రశ్నించారు. ఇలా తెలంగాణ నది జలాల వివాదం గురించి మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు ఇచ్చారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.