KTR: తాజాగా మంత్రి కేటీఆర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 23 ఏళ్ల కాలంలో కేసీఆర్ తో పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా రాజకీయంగా బాగుపడలేదు అని హెచ్చరించారు.
ఉప్పల్లో స్కైవాక్ టవర్ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలపై ఆయన కాస్త ఘాటుగా స్పందించారు. తాజాగా జరిగిన సభలో జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అంతేకాకుండా కేసీఆర్ను జైల్లో పెడతామని అన్నారని అది ఎందుకో చెప్పాలని నిలదీశారు.
పేదలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్నందుకా? కేసీఆర్ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? కేసీఆర్ను ఎందుకు జైలుకు పంపుతావు? అని జేపీ నడ్డాను ప్రశ్నించారు. కేటీఆర్. మాట్లాడే ముందు ఆలోచించే మాట్లాడాలి. మాట్లాడడానికి ఒక హద్దు, అదుపు ఉండాలి. కేసీఆర్తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడినట్లు చరిత్రలో లేదంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని, కానీ ప్రస్తుతం కెసిఆర్ ప్రభుత్వంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వేసవి కాలంలో నీటి కొరత ఇబ్బందులను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు.
నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు. కెసిఆర్ హయాంలో జరిగిన విషయాలను ఒక్కొక్కటిగా జేపీ నడ్డాకు గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. అదేవిధంగా అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడితే అది హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే కెసిఆర్ చేసిన విషయాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు కేటీఆర్.