KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని ఇతర దేశాల అధ్యక్షులు సైతం పొగుడుతున్నారు. ఆయనకు సోషల్ మీడియాల్లో వస్తున్న ఫిర్యాదులకు సైతం స్పందించి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపుతారు. ఆ సమస్య చిన్నదా.. పెద్దదా, తాను మంత్రిని ఆ సమస్య ఎవరైనా చూసుకుంటారు అని ఆలోచించకుండా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తారు. దేశ విదేశీయులతో ఎప్పుడు బీజీగా ఉండే కేటీఆర్ సామాన్యులతో కూడా అంతగా కలిసిపోయే స్వభావం ఆయనది. గత ప్రభుత్వాల వివక్ష, అలసత్వంతో జీవితాన్ని కోల్పోయిన అంశాల స్వామికి అండగా ఉండాలనకున్నాడు. గొంతు తడుపుకునేందుకు విషాన్ని తాగుతున్న ఆ గడ్డకు మంచినీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతూనే, ఫ్లోరైడ్ రాక్షసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిన అంశాల స్వామికి అండగా నిలబడ్డారు కేటీఆర్.
వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం రూ.5.5 లక్షలు మంజూరు చేయించారు. అయన జీవనాధారం కోసం ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఏర్పాటు చేయించారు. తాజాగా గురువారం మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత శివన్నగూడెంలో నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ చెప్పాపెట్టాకుండా వెళ్లారు. ఎవరో మీడియా వాళ్లు ఇంటికి వస్తున్నారని అనుకున్న స్వామి, కేటీఆర్ను చూడడంతో ఉబ్బితబ్బియ్యాడు. తన జీవితానికి భరోసా ఇచ్చిన వ్యక్తి స్వయంగా తన ఇంటికి వచ్చి ఆప్యాయంగా యోగక్షేమాలు అడగడంతో స్వామి హర్షం వ్యక్తం చేశారు.
తన కుటుంబాన్ని మంత్రికి పరిచయం చేశారు. స్వామి అమ్మానాన్నల ఆరోగ్యం గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సెలూన్ ఎట్లా నడుస్తోందని స్వామిని మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.ఆ తరువాత స్వామితో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. పప్పుచారు, పచ్చి పులుసు చాలా బాగున్నాయని చెప్పి మళ్లీ వేయించుకుని తిన్నారు. భోజనం తరువాత స్వామి సోదరి దంపతులకు కొత్త బట్టలను బహూకరించారు. . భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని స్వామికి భరోసా ఇచ్చారు. కేటీఆర్ రాకపై అంశాల స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో మీడియా వాళ్లు తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారని చెప్పారని.. కేటీఆర్ వస్తున్న సంగతి తనకు తెలియదన్నాడు. తన జీవితానికి ఆర్థిక భరోసా ఇచ్చి కొండంత అండగా నిలబడ్డ కేటీఆర్ స్వయంగా తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని స్వామి చెప్పాడు.