Kurnool Lok Sabha: కర్నూలు రాయలసీమకు ప్రధాన ప్రవేశ ద్వారం. ఒకప్పుడు రెడ్డి రాజకీయాలకు కంచుకోటగా ఉన్నటువంటి ఈ కర్నూలులో ఈసారి బీసీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మరి ఈ పోటీలో కొండారెడ్డి బురుజుపై ఎగరే జెండా ఏది అనే విషయం గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొదటిసారి కర్నూలు పార్లమెంట్ బరిలో బీసీలు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో విజయకేతనం ఎగరేసేది ఎవరనేది తెలియాల్సి ఉంది.
రాయలసీమ రాజకీయాలకు కేంద్రం.. ఒకప్పటి ఏపీ రాజధాని నగరం కర్నూలు.. ఎందరో హేమాహేమీలు.. మరెందరో రాజకీయ ఉద్దండులను గెలిచిపించిన కర్నూలులో తొలిసారిగా ఇద్దరు బీసీ నేతల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. కర్నూలు పార్లమెంట్ 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎక్కువసార్లు కర్నూలు ఎంపీగా పని చేశారు.
ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఏర్పడిందో అప్పటినుంచి కర్నూలు వైఎస్ఆర్సిపి కంచుకోటగా మారిపోయింది. కర్నూల్ పార్లమెంట్ పేరు చెబితే ఎక్కువగా గుర్తుకు వచ్చే పేర్లు కోట్ల, కేఈ కుటుంబాలే గుర్తుకు వస్తాయి. గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య గట్టి పోటీ ఉండేది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ సీటు నుంచి బీసీ నేతలకే చాన్స్ ఇచ్చింది టీడీపీ. గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయడు పోటీ చేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు.
కర్నూలు పార్లమెంట్లో వైసీపీకీ గట్టి పట్టు ఉంది ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో కూడా వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో కూడా ఈ పార్లమెంటు నుంచి తప్పనిసరిగా వైసిపి నే గెలుపొందుతుందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈసారి ఎన్నికలలో కర్నూలు మేయర్ బీవై రామయ్యకు పార్లమెంటుకు పోటీ చేసే చాన్స్ ఇచ్చింది. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు మేయర్గా ఎన్నికైన రామయ్య.. అనూహ్యంగా వచ్చిన అవకాశం అందుకొని రాజకీయ ప్రచారాలలో బిజీ అయ్యారు.