Roja: తాజాగా టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వాఖ్యలపై తాజాగా మంత్రి రోజా స్పందించింది. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆమె అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని, మహిళలు స్వతంత్ర్యంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని రోజా మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని ఆమె అన్నారు.
అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, జైల్లో ఆయన దీక్ష చేయడమంటే గాంధీజీను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అంటూ చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు నిరాహార దీక్షను ఖండిస్తున్నాము. టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి జనాలు ముందుకు రాలేదని విమర్శించారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.