Kodali Nani: మాజీ మంత్రులు అయిన పార్థసారథి, కొడాలి నానితోపాటు వంగవీటి రాధాకు తాజాగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ లను జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై కేసులను విచారిస్తున్న విజయవాడ లోని ప్రత్యేక కోర్టు న్యాయాధికారి గాయత్రీదేవి మంగళవారం ఎన్బీడబ్ల్యూలను జారీ చేస్తూ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా ఆధ్వర్యంలో 2015 ఆగస్టు 29న బంద్కు పిలుపునిచ్చింది.
అయితే ఇందులో భాగంగానే అప్పట్లో వైకాపా నేతలు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై కృష్ణలంక పోలీసు స్టేషన్లో 55 మందిపై ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదయింది. ఇందులో ఏ1గా కొలుసు పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధా పేర్లతో పాటు మరో 52 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ సాగుతోంది.
మంగళవారం నాటి విచారణకు వీరు హాజరుకాకపోవడంతో న్యాయాధికారి వీరికి నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ, కేసును తదుపరి వాయిదా నిమిత్తం ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొడాలి నాని కి చంద్రబాబు ఉసురు తగిలి ఇలాంటి గతి పట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే అయిపోలేదు ముందుంది ముసళ్ళ పండగ అంటూ కామెంట్ చేస్తున్నారు.