Perni Nani: మచిలీపట్నం బందర్ పోర్ట్ నిర్మాణ పనులలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సీఎం జగన్ తో కలిసి సభలో మాట్లాడే అవకాశం బహుశా తనకు ఉండకపోవచ్చు అంటూ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు. వయసులో తన కన్న చిన్నవాడు అయ్యారని లేకపోతే తనకు పాదాభివందనం చేసే వాడినంటూ ఈ సందర్భంగా నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తానుపుట్టిన ఈ గడ్డకు ఇంత వైభవం తీసుకు వస్తున్న సీఎం జగన్ కి చేతులెత్తి దండం పెడుతున్నానని తెలిపారు. ఇక ఈయన ఎప్పుడు ఏదో ఒక బటన్ నొక్కుతూ ఏదో ఒక సంక్షేమ వర్గానికి పథకాలు అందిస్తూనే ఉంటారని నాని పేర్కొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన రాజకీయ రిటైర్మెంట్ గురించి కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తాను ఎన్నికల బరిలో దిగనని తన వారసుడు తన తరపున ఎన్నికలలో నిలబడి రాజకీయాలలోకి రాబోతున్నారని నాని ప్రకటించారు. అయితే సీఎం జగన్ మాత్రం ఈసారి ఎవరు కూడా ప్రయోగాల జోలికి వెళ్లకుండా తమ వారసులని ఎన్నికల బరిలో దించకుండా ఎన్నికలకు వెళ్లాలి అంటూ చెబుతున్నప్పటికీ నాని మాత్రం తన కుమారుడిని వారసుడిగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే బందరులో నాని కుమారుడు కిట్టు పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఈయనని వచ్చే ఎన్నికల బరిలో దింపడం కోసమే నాని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి టికెట్ జగన్ నానికి ఇస్తారా లేక తన కుమారుడికి ఇస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.