Pothina Mahesh: ఏపీలో ఎన్డీఏ కూటమిలో టికెట్లు చిచ్చు కొన్ని నియోజవర్గాల్లో ఉంది. జనసేన, టీడీపీ మధ్య పెద్ద ఇష్యులు లేకపోయినా.. బీజేపీకి కేటాయించిన సీట్లలో ఆశావహులు ఇంకా కోలుకోవడం లేదు. టీడీపీ, జనసేన పొత్తు అనధికారికంగా ఏడాది క్రితమే కుదిరింది. కాబట్టి పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఏ పార్టీకి ఎక్కడ బలం ఉందో ముందుగానే అంచనా వేసుకున్నారు. దీంతో.. టీడీపీ, జనసేన మధ్య పెద్ద సమస్యలు లేవు. కానీ, పొత్తులో సడెన్గా బీజేపీ రావడమే కాస్త తలనొప్పిగా మారింది. చంద్రబాబు, పవన్ పొత్తు కోసం ప్రయత్నించినా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం పొత్తు కుదరదనే నమ్మకంతో ఉండేవారు. అయితే.. సడెన్గా పొత్తు కుదరడంతో బీజేపీకి టికెట్లు ఇచ్చిన స్థానాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అలాంటి స్థానాల్లో విజయవాడ వెస్ట్ ఒకటి. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన తరుఫున పోతిన మహేష్ పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, ఆ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి పోయింది. అభ్యర్థిని ప్రకటించకపోయినా.. బీజేపీకే ఆ సీటు అని ఫిక్స్ అయింది. దీంతో.. పోతిన మహేష్ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఆయనకు తోడు మహేష్ వర్గం కార్యకర్తలు కూడా రోజూ ఆందోళన చేసేవారు. టికెట్ ప్రకటించే వరకూ మహేష్ ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన చేస్తూ ఉండేవారు. కానీ.. టికెట్ ప్రకటించిన తర్వాత పోతిన మహేష్ సైలంట్ అయిపోయారు. టికెట్ దక్కకపోతే మహేష్ ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తారని ఆయన అనుచరులు అనుకున్నారు. దానికి అన్నిరకాలుగా రంగం సిద్దం చేశారు. పోతిన మహేష్ ఇండిపెండింట్ గా పోటీ చేస్తే ప్రచారం ఎలా చేయాలి అనేదానిపై కూడా ఆయన అనుచరులు ప్రణాళిక రెడీ చేసుకున్నారు. కానీ, మహేస్ సైలంట్ అయిపోవడంతో వారంతా ఇప్పుడు కంగుతిన్నారని తెలుస్తోంది. ఇప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. టికెట్ ప్రకటించడానికి ముందు ప్రతీరోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలిపేవారు. కానీ, టికెట్ ప్రకటించింది మొదలు ఇంతవరకూ ఆయన నుంచి స్పందనలేదు. సైలంట్ అయ్యారు కదా అని కూటమి అభ్యర్థి సుజనాను సపోర్టు చేస్తారు అనుకుంటే.. అది కూడా లేదు. సుజనాకు సపోర్టు చేస్తానని చెప్పింది లేదు. దీంతో.. పోతిన అనుచరులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
ఆయనపై కొంతగా ఓ విషయం ప్రచారంలోకి వస్తుంది. టికెట్ ప్రకటించడానికి ముందు ఆయన నిరసన వ్యక్తం చేస్తూ నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశానని చెబుతూ వచ్చారు. దీంతో.. ఆయన ఆర్థికంగా ఎంత నష్టపోయాడో అంత సొమ్ము సుజనా చౌదరి ఇస్తే సైలంట్ అవ్వాలని చూస్తున్నాడట. పోతినేని వర్గంలో కొంతమంది ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇంతవరకు టికెట్ కోసం పని చేశాడని అనుకున్నాం కానీ.. ఇప్పుడు ఆయన టికెట్ రాలేదని డబ్బు కోసం ప్రయత్నించడం సరికాదని చెబుతున్నారు. అయితే, ఇంతవరకూ పోతిన మహేష్ మాత్రం స్పందించలేదు. మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? సుజనా దగ్గరు డబ్బు తీసుకుంటారా? లేదంటే.. కూటమి కోసం కష్టపడి సుజనాను గెలిపిస్తారా? చూడాలి.