Roja: తిరుపతిలోని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి వివాదం రోజురోజుకు ముదురుతూనే ఉంది. రోజురోజుకీ ఈ వివాదం ఇంకా పెద్దది అవుతుందే తప్ప తగ్గడం లేదు. అలాగే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన కౌన్సిలర్ భువనేశ్వరీ ఏకంగా రోజాకే సవాల్ విసిరారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ఆమె పిల్లల మీద ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రోజా ప్రమాణం చేస్తేతాను బహిరంగంగా క్షమాపణలు చెబుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది భువనేశ్వరి. కాగా పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో 17వ వార్డు కౌన్సిలర్గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో భువనేశ్వరికి చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలను తన అన్న కుమారస్వామితో మాట్లాడాలని రోజా అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. 40 లక్షలకు బేరం కుదరగా రెండు దఫాలలో మొత్తాన్ని కుమారస్వామికి భువనేశ్వరి అందించారు. అయితే మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదు. అవకాశం ఇవ్వాలని పలు దఫాలు మంత్రి రోజాను కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కౌన్సిలర్ భువనేశ్వరి అంటున్నారు. చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు.
భువనేశ్వరి రాజకీయ కక్షతో అబద్ధాలు చేబుతోందని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి అన్నారు. వ్యతిరేకవర్గం నేతలతో కలసి మంత్రి రోజాపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ హరి మాటలకు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మరోసారి కౌంటర్ ఇచ్చారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ఆమె పిల్లల మీద ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. మరి భువనేశ్వరి వ్యాఖ్యలపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.