Roja: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ గారిని భగవంతుడు తనకు కావాలని తీసుకెళ్లారని ఏపీ మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి కృష్ణకు తాను పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు. ఆయనతో హీరోయిన్గా చేస్తున్నప్పుడు ప్రతిరోజూ కృష్ణనే చూసేదాన్నన్నారు. మంచి మనిషితో కలిసి పని చేయడం అదృష్టంగా భావించినట్టు చెప్పారు. కృష్ణ సొంత బ్యానర్లో సినిమాలు చేయడం తన అదృష్టమని తెలిపారు.
కొంత మందికి రెండు సినిమాలు హిట్ కాగానే కొమ్ములొస్తాయని, రెండు సినిమాలు ప్లాప్ అయితే చాలు ఒత్తిడికి లోనై ఎక్కడికి వెళ్లిపోతారో తెలియదన్నారు. సక్పెస్, ఫెయిల్యూర్లను సమానంగా తీసుకుంటే, ప్రశాంతంగా వుంటామనే పాఠాన్ని కృష్ణ జీవితం నుంచి నేర్చుకోవాలన్నారు. ఎంత పెద్దస్థాయికి ఎదిగినా అందరితో బాగుండాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించారు.
కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అని రోజా అన్నారు. సాహసాలు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్స్టార్ కృష్ణ అని వెల్లడించారు. ఫస్ట్ 70ఎంఎం సినిమా, ఫస్ట్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తీసింది కూడా ఆయనే అని రోజా పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ రూపమే కనిపిస్తుందన్నారు.
మహేశ్కు అత్తగా నటించాలనుంది..
కృష్ణ, విజయనిర్మల ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. మహేశ్ చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమన్నారు. మరోసారి కెమెరా ముందుకొస్తే మహేశ్ అత్తగా నటించాలనే కోరికను మరోసారి రోజా బయట పెట్టారు. గతంలోనూ ఆమె పలు సందర్భాల్లో మహేశ్తో నటించాలనుందని, అతనంటే ఎంతో ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. మహేశ్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ఎంతో గౌరవమిస్తాడని చెప్పారు. అయితే ప్రస్తుతం రోజా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగేందుకు వీలుగా జబర్దస్త్ షోను కూడా వదిలేశారు. ఈ క్రమంలో ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ వస్తే ఆమె కోరికను మహేశ్బాబు నెరవేరుస్తారేమో వేచి చూడాలి.