Viral: రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. ప్రతిరోజు మూడు పూటలా మనం కడుపునిండా భోజనం చేస్తున్నాము అంటే దాని వెనుక రైతు కష్టం ఎంతో దాగి ఉంటుందని చెప్పవచ్చు. ఆహారం ధాన్యం విలువ కేవలం పండించే ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది. వేయి పగలు, ఎండా వానని సైతం లెక్కచేయకుండా రెక్కలు ముక్కలు చేసుకుని మరి పంటను కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. కానీ అదే రైతు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక విధంగా నష్టాల పాలవుతూనే ఉన్నారు. పంట చేతికి వచ్చినా కూడా సరైన దిగుబడి లేక కనీసం పెట్టుబడి కూడా రాక ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ఇప్పటికే పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఒక పంటను పండించడానికి రైతులు ఎరువులు మందులు ఉపయోగిస్తూ ఉంటారు. ఎరువులు మందులకు స్థిరమైన ధరలు ఉండడంతో పాటు కొన్ని కొన్ని సార్లు ఆ ధరలు కూడా పెరుగుతున్నాయి. కానీ రైతు పండించే పంటకు మాత్రం స్థిరమైన ధర ఉండడం లేదు. చాలాసార్లు రైతు పండించిన పంటకు స్థిరమైన ధరలు లేక పండించిన పంటను ఏం చేయాలో తెలియక అలాగే వదిలిపెట్టిన వారు లేదంటే రోడ్డు వైపున వదిలిపెట్టి వెళ్లిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.
ప్రభుత్వం ఈ విషయాలపై సరైన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. రైతుల కోసం పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ రైతు పండించిన పంటకు స్థిరమైన ధరను మాత్రం నిర్ణయించలేకపోతోంది ప్రభుత్వం. తాజాగా ఇదే విషయం పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ వి.గోపాల గౌడ మాట్లాడుతూ.. ఎరువులు పురుగు మందులకు స్థిరమైన ధర ఉంటోంది. కానీ రైతన్న పండించే పంటకు మాత్రం స్థిరమైన ధరలు ఉండడం లేదు. ఇది సరైనది కాదు. రైతులను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎప్పటికీ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే దేశం కుప్పకూలుతుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.