AmmaVodi: ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఉపయోగించుకొని కొందరు కేటుగాళ్లు అమాయకులను సులభంగా మోసం చేసి కంటికి కనిపించకుండానే నిమిషాలలో అకౌంటు నుండి డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పటివరకు ఏదైనా బ్యాంకు లేదా కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బు దొంగలించిన గేటుగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ పథకాలను అడ్డుపెట్టుకొని అమాయకుల నుండి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన చోటుచేసుకుంది.
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం, ములగపూడిలో అమ్మ ఒడి డబ్బుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసి వారి అకౌంటు నుండి డబ్బులు కాజేసారు.నాతవరం మండలం ములగపూడి కి చెందిన వాలంటీరు రాజేశ్వరికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము అమరావతి ప్రభుత్వ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని ఆమెను నమ్మించి అమ్మఒడి పథకం డబ్బులు రానివారి ఫోన్ నంబర్లు ఇవ్వమని అడిగారు.
దాంతో రాజేశ్వరి తమ గ్రామంలో అమ్మఒడి డబ్బులు రాని భాగ్యలక్ష్మి, రవికుమార్ ఫోన్ నంబర్లను వారికి ఇచ్చింది. దాంతో కేటుగాళ్లు వారికి ఫోన్ చేసి అమ్మబడి పథకం కింద డబ్బులు వచ్చేలా చేస్తామని వారిని నమ్మించి వారి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని ఆ తర్వాత మొబైల్ నెంబర్ కి ఒక లింకు పంపించారు. వారు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే భాగ్యలక్ష్మి అకౌంట్ నుంచి రూ. 9 వేలు, రవికుమార్ ఖాతా నుంచి రూ. 4 వేలు కట్ అయ్యాయి.
దీంతో మోసపోయామని గ్రహించిన భాగ్యలక్ష్మి-రవి కుమార్ దంపతులు వెంటనే పోలీసు స్టేషన్కు వెల్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులు లబ్ధిదారులకు కాల్స్ చేయరని.. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు.