Ram Charan-NTR: లాస్ ఏంజెల్స్లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోసు ఈ అవార్డు అందుకున్నారు. దీంతో తెలుగు జాతితోపాటు దేశం గర్విస్తోంది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఈ పాటకు ఊపు తెచ్చారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ స్టెప్పులతో పాటను మరో లెవల్కు తీసుకెళ్లారని చెప్పవచ్చు.
ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాలుగు పాటలు పోటీ పడ్డాయి. నాలుగు పాటలు నామినేట్ అయినట్లు జనవరి 24న అకాడమీ ప్రకటించింది. వీటిల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాటతో పాటుగా టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ నుంచి అప్లాజ్, టాప్ గన్;మావ్ రిక్ సినిమా నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాట, బ్లాక్ పాంథర్;వకండా నుంచి లిఫ్ట్ మీ అప్ పాటలున్నాయి.
జనవరి 15న బెస్ట్ సాంగ్ కేటగిరీలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు దక్కింది. జనవరిలో ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు, ఫిబ్రవరిలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, హ్యుస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు దక్కాయి. అయితే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడంతో తారక్, చరణ్ మార్కెట్ 3000 కోట్లకు పెరిగిందని ఇకపై ఇతర రాష్టాల్లో కూడా తెలుగు సినిమాలు అంచనాలకు మించి ఆడటం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.