YSRCP: రాయలసీమలో మొదట్లో కాంగ్రెస్ .. ఆ తర్వాత వైసీపీ ఎక్కువ ప్రభావం చూపిస్తూ వస్తుంది. సీమ జిల్లాల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాలో మాత్రం టీడీపీ మెరుగైన ఫలితాలు చూపించేది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హిందుపురం నుంచి పోటీ చేయడంతో అనంతపురం, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు కావడంత ఆ జిల్లాలో కూడా మెరుగైన ఫలితాలు టీడీపీకి ఉండేవి. కానీ, ఎన్నికల్లో మాత్రం ఆ 2 జిల్లాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అనంతపురం జిల్లాలో రెండు స్థానాలు, చిత్తురు జిల్లాలో ఒక స్థానం తప్ప మిగిలినవి అన్నీ వైసీపీ గెలుచుకుంది. చిత్తూరు జిల్లాలో అదీ చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం తప్ప మిగిలిన స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే.. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చిత్తూరులో వైసీపీ చిత్తు చిత్తు కాక తప్పదని ప్రచారం జరుగుతోంది. మే13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు హావా ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. జగన్ పాలనపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారని అన్ని సర్వేలు తేలుస్తున్నాయి. అన్నింటికి మించి చిత్తూరు జిల్లాపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరింస్తుదనే అభిప్రాయం ఉంది. టీడీపీ నేతలు, వారి మద్దతుదారులపై వైసీపీ దాడులకు చేసిందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. దీనికితోడు అభివృద్ది అనే మాట లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ చెప్పుకోవడానకి ఒక్కటి అంటే ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా నిర్వహించలేదు. ఎక్కడ చూసినా వైసీపీ నేతల అవినీతి, అక్రమాలే తప్పా.. పాలన, అభివృద్ది అనే మాట లేదు. దీంతో.. కూటమి నేతలకు పట్టం కట్టడానికి చిత్తూరు ప్రజలు సిద్దం అయ్యారని సర్వేలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా తెలుస్తోంది.
సత్యవేడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నేత కోనేటి ఆదిమూలం పోటీచేసి విజయం సాధించారు. అయితే జగన్ తీరు నచ్చక ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకే టికెట్ కేటాయించారు. లోకల్ టీడీపీ నేతలు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. దీంతో.. టీడీపీ గెలుపు ఖాయంగా తెలుస్తోంది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె. నారాయణ స్వామి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదేళ్లలో నియోజవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. జగన్ ఆయన్ని తప్పించి ఆయన కుమార్తె కృపా లక్ష్మీకి టికెట్ ఇచ్చారు. అయితే.. ఆ ఇంట్లోనే అధికారం ఉంటుందని.. ఆమె గెలిస్తే నారాయణ స్వామి పెత్తనమే నడుస్తుందని కనుక వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు.
పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పటి వరకూ టీడీపీ గెలిచిందే లేదు.గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచిన ఎంఎస్ బాబును తప్పించి డాక్టర్ సునీల్ కుమార్ కు జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో పూతలపట్టులో వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. దానికితోడు జనసేన, బీజేపీతో పొత్తు టీడీపీతో కలిసి వస్తుంది.
నగరి నియోజకవర్గం నుంచి ఆర్కే రోజా 2014, 2019 విజయం సాధించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఆమెపై ఓడిపోయారు. ఈసారి కూడా ఆయననే రోజాపై పోటీ చేస్తున్నారు. రోజా ఫ్యామిలీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలే కాకుండా సొంతపార్టీలో కూడా ఆమెపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ కూడా ఇవ్వొద్దని చాలా మంది వైసీపీ అధినేతకు చెప్పారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. కానీ.. జగన్ ఆమెకే మరోసారి అవకాశం కల్పించారు. వైసీపీ నేతలే ఆమెను ఓడిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీకి పార్టీకి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధు సూదన్ రెడ్డి విజయం సాధించాడు. ఇక్కడ నుంచి టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఐదుసార్లు విజయం సాధించాడు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు బొజ్జల వెంకట సుధీర్రెడ్డి టీడీపీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. ఈ సారి కూడా మధు సూదన్ రెడ్డి, సుధీర్ రెడ్డిలే తలపడుతున్నారు. మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో కామెడీ చేయడం తప్పా నియోజవర్గంలో అభివృద్ది చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఆయన్ని ఇంటికి పంపించి ప్రజలు వెంకట సుధీర్ రెడ్డిని అసెంబ్లీకి పంపిస్తారని సర్వేలు చెబుతున్నాయి.
చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, వైసీపీ అభ్యర్థిగా ఎం. విజయానందరెడ్డి బరిలోకి దిగుతున్నాడు. విజయానంద్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనాన్ని కొల్లగొట్టి కోట్లు సంపాదిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయనకు ఓటమి తప్పదని అంటున్నారు. చంద్రగిరి నుంచి 2014, 19లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పులివర్తి వెంకటమణిప్రసాద్ పోటీ చేస్తున్నాడు. చంద్రగిరిలో వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ, జనసేనతో జట్టుకట్టడం టీడీపీకి కలిసి వస్తుంది.
కుప్పంలో మరోసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన ఎలాగు గెలుస్తారు. పుంగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి కక్షపూరిత రాజకీయాలపై నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంతే కాదు తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్పా.. పెద్ది రెడ్డి గెలిచే అవకాశం లేదు. తిరుపతి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించాడు. ఈసారి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కూటమి నుంచి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్యమత ప్రచారం వైసీపీని ఈసారి ఓడిస్తుందని అంటున్నారు.