Team India: టీ20 సిరీస్ గెలిచి జోరుమీదున్న భారత్కు తొలి వన్డేలో ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతోంది. టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. తర్వాత రెండో మ్యాచ్లో భారత్ భారీ విక్టరీ సాధించింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీతో భారత్ను గెలిపించాడు. తర్వాత మూడో టీ20కి వర్షం అడ్డు తగిలింది. తొలి ఇన్నింగ్స్ బాగానే సాగినా భారత్ ఛేజింగ్ చేస్తున్న క్రమంలో వర్షం కురిసింది.
డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమంగా ఉండటంతో అంపైర్లు టైగా ప్రకటించారు. అప్పటికి టీమిండియా 75 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ టైగా ముగియడంతో 1-0తో సిరీస్ను భారత్ గెలుచుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య నేతృత్వంలోని టీమిండియా టీ20 సిరీస్ను దక్కించుకుంది. మరోవైపు వన్డేల విషయానికి వచ్చే సరికి బౌలర్లు తేలిపోయారు.
ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించినా బౌలర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీ20లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు కెప్టెన్గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్నారు. తొలి వన్డేలో శిఖర్ ధావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీలతో రాణించారు. 306 పరుగులు చేసినప్పటికీ కివీస్ ఛేజింగ్ చేసేసింది. కివీస్ బ్యాటర్లు టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ విజృంభించడంతో మ్యాచ్ అవలీలగా న్యూజిలాండ్ నెగ్గింది.
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఇక రెండో వన్డే నిర్వహణపై నీలినీడలు కమ్మకున్నాయి. అందుకు కారణం 91 శాతం వర్షం ముప్పు ఉండటమే. హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేకు వరుణుడి గండం పొంచి ఉంది. మ్యాచ్ నిర్వహించేది దాదాపు అసాధ్యమనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టీ20 సిరీస్లోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు.