CM Revanth Reddy: ఏపీలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఏపీపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో కాంగ్రెస్ గేరు మార్చింది. ఇప్పటి వరకూ ఓ లెక్క ఇప్పుడో లెక్క అని షర్మిల తొలిరోజే సంకేతాలు ఇచ్చారు. కానీ షర్మిల తన ప్రచారం, పంచులు, సెటైర్లతో ప్రతీ రోజూ లెక్కలు మారుస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ లెక్కలు మరింతగా మారేలా కనిపిస్తున్నాయి. ఊరూరు తిరుగుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్న షర్మిల.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ నేతలను ప్రచారానికి వాడుకునేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తిరుపతిలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 25న రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరువుతారు. ఆయన చేతులమీదగానే ఏపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కూడా విడుదల చేయనుంది. ఇదే సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరవుతారని తెలుస్తోంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కానీ.. బహిరంగ సభలు ప్లాన్ చేయలేదు. ఇప్పటికే తన ప్రసంగాలతో ఏపీ కాంగ్రెస్లో ఓ ఊపు తీసుకొచ్చిన షర్మిల పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు రేవంత్ రెడ్డితో సభను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
షర్మిల ప్రస్తుతం తన వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 17న వివాహం జరగనుంది. 18న రిసెష్పన్ ఉంటుంది. ఆ తర్వాత షర్మిల మళ్లీ యాక్టివ్ అవుతారు. పెళ్లి పూర్తి అయిన తర్వాతే బహిరంగ సభను పెడితే దానిపై పూర్తిగా ఫోకస్ చేయొచ్చని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఈనెల 25న ప్లాన్ చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ తాజా రాజకీయాలపై రేవంత్ రెడ్డితో చర్చించారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు కూడా అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పి.. దానికి హాజరుకావాలని రేవంత్ రెడ్డిని ఆమె ఆహ్వానించారని టాక్. రేవంత్ రెడ్డి కూడా ఆమెకు సభకు హాజరవుతున్నట్టు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు కూడా ఆహ్వానం అందినట్టు సమాచారం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారట. సభను కూడా తిరుపతిలో వ్యూహాత్మకంగానే పెట్టినట్టు తెలుస్తోంది. కర్నాటకాకు ఆనుకొని ఉన్న రాయలసీమలో పెడితే.. ఆ ప్రాంతంలో కర్నాటక నేతల ప్రభావం పని చేస్తుందని అక్కడ ప్లాన్ చేశారట. ఇక, రేవంత్ రెడ్డికి ఏపీలో మంచి క్రేజ్ ఉంది. దీంతో.. భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. సభను గ్రాండ్ సక్సెస్ చేసి వైసీపీ షాక్ ఇవ్వాలని షర్మిల డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
ఇక, ఆ తర్వాత రోజే మల్లికార్జున్ ఖర్గే కూడా ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. వరుసగా కాంగ్రెస్ లో కీలక నేతలతో సభలు పెట్టి కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం పెంచేందుకు షర్మిల రెడీ అయ్యారు.