Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందర్ రాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తమిళి సై తెలంగాణ సర్కార్ పై దుమ్మెత్తిపోశారు. మూడేళ్లుగా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, ఎట్ హోంకు వస్తానని చెప్పి సీఎం కేసీఆర్ రాలేదన్నారు. రాజ్ భవన్ ఏమైనా నిషేధిత ప్రదేశమా అని తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా గవర్నర్ పట్ల వివక్ష చూపించడం సమంజసం కాదని తెలిపారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలిక్యాప్టర్ అడిగితే ఇవ్వలేదని, అందుకే 8 గంటలు ప్రయాణం చేసి మేడారం జాతరకు వెళ్లానని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని వ్యాఖ్యానించారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని, కానీ ప్రజలకు తెలుసుకోవాలని తమిళి సై అన్నారు. తనను గౌరవం ఇవ్వకపోయినా పట్టించుకోనని, కానీ రాజ్ భవన్ ను గౌరవించాలని కాదా అని ప్రశ్నించారు.
75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకున్న నేపథ్యంలో ఇలా వివక్ష చూపడం సరికాదని తమిళి సై విమర్శించారు. ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పనిచేస్తానని, రాజ్ భవన్ ప్రజాభవన్ గా మారిందన్నారు. ప్రజల్లో రాజ్ భవన్ పట్ల విశ్వాసం మరింత పెరిగిందని, పేదల సమస్యల కోసం తాను పనిచేస్తానన్నారు. ప్రజలకు కలవాలని అనుకున్న ప్రతిసారి చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.
కాగా గత కొంతకాలంగా ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. కేసీఆర్, తమిళి సై మధ్య విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ పై డైరెక్టుగా గవర్నర్ కామెంట్స్ చేయడం, దీనికి టీఆర్ఎ్ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.